snap chat

Snap Chat Love : స్నాప్ చాట్ లో పరిచయమైన ఒక అమ్మాయిని చూడటానికి, అలాగే తన తాత ముత్తాతల ఆస్తిని సంపాదించుకోవడానికి బోర్డర్ దాటి ఇండియాలోకి వచ్చిన ఒక 22 ఏళ్ల యువకుడిని భారత సైన్యం తిరిగి పాకిస్తాన్ అధికారులకు అప్పగించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉండే జీషాన్ మీర్ అనే ఈ యువకుడు, మే నెలలో కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి దొరికిపోయాడు. నిన్న శనివారం మధ్యాహ్నం ఉరీ బోర్డర్ దగ్గర ఉన్న కమన్ అమన్ సేతు వంతెన వద్ద అతడిని పాకిస్తాన్ ఆర్మీకి మన సైన్యం అప్పగించింది.

అసలు ఏం జరిగిందంటే.. జీషాన్ మీర్ ఇంట్లో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. డబ్బులు సంపాదించాలని, ఇల్లు గడవడానికి సాయం చేయాలని ఇంట్లో వాళ్లు రోజూ గొడవ చేస్తుండటంతో అతను తీవ్రమైన మానసిక బాధలో ఉన్నాడు. ఈ టైమ్‌లోనే అతనికి స్నాప్‌చాట్ యాప్‌లో కాశ్మీర్‌కు చెందిన ఇరుమ్ బానో అనే అమ్మాయితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. మాట్లాడుకునే రోజుల్లోనే జీషాన్ తాత ముత్తాతలు కూడా ఒకప్పుడు ఆ అమ్మాయి ఉంటున్న ఊరిలోనే ఉండేవారని వారికి తెలిసింది.

Also Read : 140 కోట్ల మంది భారతీయుల తరఫున.. ట్రంప్ కు మోదీ విషెస్

తన ఇంట్లో ఉన్న కష్టాలన్నీ జీషాన్ ఆ అమ్మాయితో చెప్పుకున్నాడు. దాంతో ఆ అమ్మాయి.. బోర్డర్ దాటి తమ ఊరికి వచ్చేయమని ఐడియా ఇచ్చింది. దీనికోసం ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ కూడా వేసుకున్నారు. జీషాన్ ఎలాగైనా బోర్డర్ దాటి ఇండియాలోకి వచ్చి, నేరుగా మన సైన్యానికి లొంగిపోవాలని అనుకున్నాడు. పర్మిషన్ లేకుండా దేశంలోకి వచ్చినందుకు కోర్టు ఇచ్చే శిక్ష అనుభవించి బయటకు వచ్చాక, తన తాతల ఆస్తిని లీగల్‌గా తీసుకుని, ఆ అమ్మాయితో అక్కడే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలని ప్లాన్ చేశారు.

కానీ, మే 31న బోర్డర్ దాటుతుండగానే మన ఇండియన్ ఆర్మీ అతడిని పట్టుకుంది. సైన్యం అతడిని గట్టిగా విచారించింది. జీషాన్ చెప్పిన విషయాలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఆ అమ్మాయిని కూడా పిలిపించి మాట్లాడారు. అప్పుడు ఆ అమ్మాయి.. జీషాన్ చెప్పింది నిజమేనని ఒప్పుకుంటూ, అతడిని తిరిగి పాకిస్తాన్‌కు పంపించకుండా ఇక్కడే ఉండనివ్వాలని అధికారులను బతిమిలాడింది. అయితే, ఈ వ్యవహారంలో ఏదైనా దేశద్రోహం లేదా కుట్ర ఉందా అని పోలీసులు, భద్రతా అధికారులు పూర్తిగా చెక్ చేశారు. ఎలాంటి తప్పు లేదని తేలడంతో అతడిని తిరిగి పంపేయాలని డిసైడ్ అయ్యారు.

నిన్న శనివారం జీషాన్ మీర్‌ను పాకిస్తాన్ సైన్యానికి అప్పగించారు. అయితే, ఇండియాలో ఉన్నన్ని రోజులు జీషాన్‌ను మన సైన్యం ఎంతో గౌరవంగా చూసుకుందని, అతనికి ఏ లోటూ రాకుండా చూసుకున్నామని ఆర్మీ అధికారులు చెప్పారు. శత్రు దేశం వాడైనా మానవత్వంతో చూసుకోవడం మన భారత సైన్యం గొప్పతనమని వారు తెలిపారు.

Also Read : ఇజ్రాయెల్ దెబ్బకు ఇరాన్ హై అలర్ట్.. తండ్రి అంత్యక్రియలకు మొజ్తబా ఖమేనీ దూరం!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.