BIG BREAKING : ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆన్‌లైన్‌లో చంపేస్తామంటూ బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. మెల్‌బోర్న్ నగరంలో జరగబోయే ఒక పెద్ద బహిరంగ సభలో ఆయన పాల్గొనడానికి కొన్ని రోజుల ముందే ఈ ఘటన జరగడంతో ఆస్ట్రేలియా రక్షణ సంస్థలు అలర్ట్ అయ్యాయి. దీనిపై అక్కడి అధికారులు దర్యాప్తును కూడా మొదలుపెట్టారు.

వచ్చే బుధవారం (జూలై 9న) మెల్‌బోర్న్‌లోని మార్వెల్ స్టేడియంలో మెల్‌బోర్న్ మీట్స్ మోదీ పేరుతో ప్రవాస భారతీయులతో ఒక పెద్ద సభ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తూ ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక పోస్ట్ కింద, అబూ ముస్తఫా అనే పేరున్న అకౌంట్ నుండి ఒక కామెంట్ వచ్చింది. ఆ కార్యక్రమం జరిగే సమయంలో స్టేడియం పైకప్పు మూసి ఉంచడం మంచిది.. లేదంటే ఆయన ఆస్ట్రేలియాకు వచ్చేది చావడానికే అంటూ ఆ కామెంట్‌లో రాశారు.

అత్యంత భారీ భద్రత

ఈ బెదిరింపుల నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యంత భారీ భద్రతను ఏర్పాటు చేస్తోంది. ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు, స్టేట్ పోలీసులు, అలాగే ప్రత్యేక రక్షణ విభాగాల అధికారులు కలిసి ఈ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సాధారణంగా ఇతర దేశాల అధినేతలకు ఇలాంటి బెదిరింపులు వస్తే అక్కడి చట్టాలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిందితులను పట్టుకుంటాయి. ప్రధాని మోదీ ఈ పర్యటనలో ఆస్ట్రేలియా అధికారులతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు, మార్వెల్ స్టేడియంలో భారీ సంఖ్యలో రానున్న భారతీయ సమాజంతో కూడా ముచ్చటించనున్నారు. ప్రస్తుతం ఈ బెదిరింపు వ్యవహారంపై విచారణ వేగంగా సాగుతోంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.