ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర లడఖ్ ప్రజల హక్కుల కోసం ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్ష నేటికి 19వ రోజుకు చేరింది. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో ఈ దీక్ష సాగుతోంది. హిమాలయ పర్వతాల మధ్య ఉండే లడఖ్ అందమైన ప్రాంతమే కాదు.. పర్యావరణ పరంగా చాలా సున్నితమైనది. అక్కడి ప్రత్యేక సంస్కృతిని, ప్రకృతిని కాపాడుకోవడమే ఈ దీక్ష ముఖ్య ఉద్దేశ్యం. లడఖ్‌ను భారత రాజ్యాంగంలోని ‘ఆరో షెడ్యూల్’ పరిధిలోకి తీసుకురావాలని దానికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని సోనం వాంగ్‌చుక్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ.. లడఖ్ సంరక్షణ కోసం చేస్తున్న ఈ పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు.

Also Read : ఈ రాశులకు పట్టనున్న అదృష్టయోగం.. కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటేనే!

వరుసగా 19 రోజులుగా ఫుడ్ తీసుకోవడం మానేయడంతో సోనం వాంగ్‌చుక్ వీక్ అయ్యారు. నిరాహార దీక్ష ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు ఏకంగా 9 కేజీల బరువు తగ్గారు. ప్రస్తుతం ఆయన బరువు 56.9 కేజీలుగా ఉంది. రక్తంలో చక్కెర స్థాయి 80 mg/dL కి పడిపోగా, నాడి వేగం నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటోంది. రక్తపోటు పడుకున్నప్పుడు 105/61 mmHg గా, కూర్చున్నప్పుడు 101/65 mmHg గా నమోదైంది. తన కండరాలు బాగా బలహీనపడ్డాయని, కానీ గుండె, శరీరం లోపల ఇంకా బలంగానే ఉన్నాయని వాంగ్‌చుక్ తెలిపారు. అయితే మరో రెండు లేదా నాలుగు రోజుల్లో చనిపోయేంత తీవ్రమైన పరిస్థితిలో లేనని.. తన గురించి ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.

Also Read : మోటో మావ కుమ్మేశాడు: కొత్త ఫోన్ లాంచ్.. రూ.5వేల భారీ డిస్కౌంట్..!

సోనం వాంగ్‌చుక్ పూర్తిగా తినకపోవడం వల్ల తన ఆరోగ్యం కాస్త దెబ్బతిన్నది. దీంతో వెంటనే అతనికి ఆహారం, వైద్యం అందించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దీనిపై అత్యవసరంగా స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాల న్యాయాధికారులు గురువారం కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. మరోవైపు ఈ ఉద్యమానికి రాజకీయ వర్గాల నుండి మద్దతు పెరుగుతోంది. ఢిల్లీ ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ సాయంత్రం జంతర్ మంతర్ వద్దకు వచ్చి వాంగ్‌చుక్‌ను కలవనున్నారు. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆయనను కలిసే అవకాశం ఉంది. ఇటు మహారాష్ట్రకు చెందిన ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరే కూడా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “ప్రజల గళాన్ని వినిపిస్తున్న ఒక కార్యకర్తను బలి ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోందా?” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన ఆరోగ్యం పాడవుతోందని దీక్ష విరమించమని విజ్ఞప్తి చేస్తున్న వారికి వాంగ్‌చుక్ ఒకే ఒక్క సమాధానం ఇచ్చారు. నేను ఇప్పుడు దీక్ష విరమిస్తే ప్రభుత్వానికి ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. నిరసనకారులు వచ్చి అలా వెళ్ళిపోతారనే తప్పుడు సంకేతం వెళ్తుందన్నారు. దీనికి బదులుగా, లడఖ్ ప్రజల కోసం జూలై 20వ తేదీన సీజేపీ తలపెట్టిన చలో సంసద్ పాదయాత్రలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.