
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధానికి ముగింపు పలికేలా 60 రోజుల కాల్పుల విరమణ గడువులోగా తుది ఒప్పందం కుదరకపోతే, హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఓడలపై వాషింగ్టన్ టోల్ పన్నులను విధించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ 60 రోజుల కాల్పుల విరమణ సమయంలో హోర్ముజ్ జలసంధిలో ఎలాంటి టోల్ వసూళ్లు ఉండవని, అలాగే ఈ గడువు ముగిసిన తర్వాత కూడా ఎలాంటి ఫీజులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
అయితే, ఒకవేళ అనుకున్న సమయానికి ఒప్పందం పూర్తి కాకపోతే మాత్రం, అమెరికా తరఫున తామే స్వయంగా ఈ టోల్ పన్నులను విధిస్తామని శనివారం తన ట్రూత్ సోషల్ ఖాతాలో పెట్టిన పోస్ట్లో ట్రంప్ తేల్చి చెప్పారు. మిడిల్ ఈస్ట్ దేశాలకు తాము ఒక రక్షక దేవత లాగా సేవలు అందిస్తున్నామని, అందుకు ప్రతిఫలంగా గత, ప్రస్తుత భవిష్యత్తు ఖర్చుల రికవరీ కోసమే ఈ టోల్ వసూలు చేయాలని భావిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ వ్యాఖ్యలు వచ్చిన కొన్ని గంటల్లోనే ఇరాన్కు చెందిన ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్క్వార్టర్స్ కీలక ప్రకటన చేసింది. లెబనాన్లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ అక్కడ ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయని, పైగా అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలోని మొదటి నిబంధనను గౌరవించడంలో వాషింగ్టన్ విఫలమైందని ఆరోపిస్తూ హోర్ముజ్ జలసంధిని తాము మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఇరాన్ చేసిన ఈ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ వెంటనే ఖండించింది, కానీ దీనికి సంబంధించి పూర్తి వివరాలను మాత్రం ఇంకా బయటపెట్టలేదు.
ఎలాంటి టోల్ లేకుండా
ఈ టోల్ వివాదం అంతా ఇటీవలే కుదిరిన అమెరికా-ఇరాన్ అవగాహన ఒప్పందం నుండి మొదలైంది. ఈ ఒప్పందం ప్రకారం సుదీర్ఘ కాలంలో హోర్ముజ్ జలసంధిపై ఇరాన్కు నియంత్రణ ఉంటుందా లేదా అనే విషయాన్ని ఇంకా తేల్చలేదు. ప్రస్తుత ఏర్పాటు ప్రకారం 60 రోజుల పాటు ఓడలు ఎలాంటి టోల్ లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ లోగా ఇరాన్ దాని పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలు ఒక దీర్ఘకాలిక ప్రణాళికపై చర్చలు జరపాల్సి ఉంటుంది. అయితే ఈ ఒప్పందంలో ఉన్న ఒక లొసుగు వల్ల, 60 రోజుల గడువు ముగిసిన తర్వాత అమెరికా కాకుండా ఇరాన్ ఫీజులు వసూలు చేసే అవకాశం లభిస్తుంది. ఈ వారం మొదట్లో ట్రంప్ మాట్లాడుతూ ఈ జలసంధి మొదటి 60 రోజులు, ఆ తర్వాత కూడా టోల్-ఫ్రీగా ఉంటుందని గట్టిగా చెప్పారు. కానీ శనివారం ఆయన చేసిన పోస్ట్ చూస్తే ఆ మాటలకు భిన్నంగా ఉంది. ఒప్పందం కుదిరితేనే టోల్ ఫ్రీ ఉంటుందనే నిబంధనను ఆయన ఇప్పుడు స్పష్టంగా పెట్టారు.









