BJP : అయోధ్య రామాలయం విరాళాల దుర్వినియోగం వివాదంపై జ్యోతిర్మఠానికి చెందిన స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి తీవ్ర విమర్శలు చేశారు. రామాలయం విరాళాల దొంగతనంపై నమోదైన FIRను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కేవలం నోట్లు లెక్కించే చిన్న స్థాయి ఉద్యోగులను మాత్రమే ఇందులో నిందితులుగా చేర్చారని, అసలైన పెద్ద తలకాయలను, అవినీతికి కారణమైన వారిని ప్రభుత్వం తప్పించిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న తన గో ధర్మ యాత్రలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ, అయోధ్య ట్రస్ట్ తీరుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

“కేవలం నోట్లను సరిచేసి, లెక్కబెట్టి, కట్టలు కట్టిన చిన్న ఉద్యోగులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని విన్నాం. నోట్లు లెక్కించేవాడు దొంగతనం చేస్తే మహా అయితే కొన్ని నోట్లు దాచుకోగలడు. కానీ, పెద్ద ఎత్తున కోట్ల రూపాయల విరాళాల దోపిడీ చేసింది మాత్రం వెనుక ఉన్న పెద్ద పెద్ద ప్రభావవంతమైన వ్యక్తులే. మరి వారిపై ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు?” అని ఆయన ప్రశ్నించారు. దీనిపై విపక్షాలు ఈ అవినీతిపై మొదటి నుంచి చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందని, విచారణ జరిపి ఇప్పుడు కేసు పెట్టడమే అందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

రామమందిరం ఏర్పాటు సమయం నుంచే అక్కడ అన్నీ ఏకపక్ష నిర్ణయాలు జరుగుతున్నాయని అవిముక్తేశ్వరానంద్ మండిపడ్డారు. ఆలయ నిర్మాణంలో వేదాలను, శాస్త్రాలను గానీ, మత పెద్దల సలహాలను గానీ పాటించలేదని ఆరోపించారు. బీజేపీది అంతా నకిలీ హిందుత్వమని, అందులోని వారంతా నకిలీ హిందువులటంటూ ఆయన ఘూటు విమర్శలు చేశారు, ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయింది కాబట్టి ఆ పార్టీ నిజమైనదే కావచ్చు, కానీ వారి హిందుత్వం మాత్రం నిజమైనది కాదన్నారాయన. వేదాలను, శాస్త్రాలను, గురువులను నమ్మేవాడే నిజమైన హిందువు. వీరు వేటినీ నమ్మరంటూ చెప్పుకొచ్చారు.

Also Read : రూ.888లకే ఆల్-ఇన్-వన్ బేబీ బెడ్డింగ్ సెట్.. నిద్రకు కొదవ లేదు..!

ప్రభుత్వానికి తగిన గుణపాఠం

నిజంగా అంతా పారదర్శకంగా చేయాలనుకుంటే రామాలయ ట్రస్ట్‌ను నలుగురు శంకరాచార్యులకు, రామానుజాచార్యులకు లేదా ఇతర మత పెద్దలకు అప్పగించాల్సిందని, అలా కాకుండా రాజకీయ నాయకులకు నమ్మకస్తులైన వారిని ట్రస్ట్‌లో పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం మొదటి నుంచే స్పష్టంగా ఉందన్నారు. అలాగే వారణాసిలో ఆలయాల కూల్చివేతపై యూపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. చరిత్ర ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతుందన్నారు.

మే 3 నుంచి గోరఖ్‌పూర్ నుంచి తాను గో ధర్మ యాత్రను ప్రారంభించానని, ఇప్పటివరకు దాదాపు 170 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించినట్లు స్వామి అవిముక్తేశ్వరానంద్ తెలిపారు. రాబోయే 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోసంరక్షణకు కట్టుబడి ఉండే అభ్యర్థులకే ఓటు వేయాలని ప్రజలను చైతన్యపరచడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని చెప్పారు.

Also Read : ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ ఉన్నా మనం భారతీయులు కాదా? మరి ఏ డాక్యుమెంట్లు కావాలంటే ?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.