Rythu Bharosa : రాష్ట్రంలో ‘రైతు భరోసా’ పథకం కింద లబ్ధి పొందేందుకు కొత్త రైతులకు ప్రభుత్వం అద్భుతమైన అవకాశం కల్పించింది. ఇప్పటివరకు ఈ పథకంలో నమోదు చేసుకోని వారు, అలాగే కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ జూన్ 15వ తేదీ నాటికి కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందుకున్న రైతులందరూ ఈ విడత రైతు భరోసా సాయం పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.

జూలై 5 లోగా దరఖాస్తు చేసుకోవాలి:

అర్హులైన కొత్త రైతులు జూలై 5వ తేదీ లోపు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణాధికారి (AEO) లేదా మండల వ్యవసాయ అధికారి (MAO)ని కలిసి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారంతో పాటు కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ మొదటి పేజీ జిరాక్సు కాపీలను జత చేయాలి. ఈ దరఖాస్తులను అధికారులు సిసిఎల్ఏ (CCLA) డేటాతో సరిపోల్చి, రైతు భరోసా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా లబ్ధిదారుల జాబితాను అప్‌డేట్ చేస్తారు.

రూ.7 వేల కోట్ల భారీ రుణం:

రైతు భరోసా నిధుల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధుల సమీకరణ చేస్తోంది. ఇందుకోసం బహిరంగ మార్కెట్‌ నుంచి ఒకేసారి రూ. 7,000 కోట్ల రుణాన్ని సేకరించేందుకు ఆర్బీఐ (RBI)కి ఇండెంట్‌ పెట్టింది.దీనికోసం ప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకి ఇండెంట్‌ పెట్టింది. 13 ఏళ్ల కాలపరిమితితో రూ.1000 కోట్లు, 18 ఏళ్ల కాలపరిమితితో రూ.2 వేల కోట్లు, 23 ఏళ్ల కాలపరిమితితో రూ.2 వేల కోట్లు, 29 ఏళ్ల కాల పరిమితితో రూ.2 వేల కోట్ల చొప్పున ప్రభుత్వం ఆర్‌బీఐ నుంచి రుణంతీసుకోడానికి సిద్ధమైంది. ఈ నిధులు ఈ నెల 30 నాటికి ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి; దీనికి ప్రభుత్వం మరో రూ. 2,000 కోట్లు జోడించి రైతులకు పెట్టుబడి సాయంగా అందించనుంది.

ఈ నెల 30నే నగదు బదిలీ ప్రారంభం:

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించిన విధంగా, ఈ నెల 30వ తేదీన రైతుల ఖాతాల్లో రైతుభరోసా పెట్టుబడి సాయం నేరుగా జమ కానుంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ నిధుల విడుదలను అధికారికంగా ప్రారంభించనున్నారు. గత యాసంగి సీజన్‌లో కేవలం రెండు ఎకరాల వరకే పరిమితమైన ఈ సాయాన్ని, ఈ ఖరీఫ్‌లో మాత్రం పూర్తి స్థాయిలో అందించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.

ఎకరాల వారీగా విడతలవారీ పంపిణీ:

గత ఖరీఫ్‌ సీజన్‌ తరహాలోనే ఈసారి కూడా అత్యంత వేగంగా, కేవలం 8 రోజుల్లోనే నగదు బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. మొదటి రోజు ఒక ఎకరం భూమి ఉన్న రైతులకు (ఎకరానికి రూ. 6,000 చొప్పున) సుమారు రూ. 900 కోట్లు బదిలీ చేస్తారు. ఆ తర్వాత ప్రతిరోజూ భూమి విస్తీర్ణాన్ని ఒక ఎకరం చొప్పున పెంచుకుంటూ.. చివరి రోజున 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు ఒకేసారి నగదు జమ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మొదటి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న పట్టాదారులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున చెల్లిస్తారు. దీనికి రూ.900 కోట్ల నిధులు అవసరమవుతాయి. రెండెకరాల వరకు నగదు బదిలీ చేస్తే రూ.2,400 కోట్లు అవసరమవుతాయి. అలా రోజుకో ఎకరం చొప్పున పెంచుకుంటూ.. 10 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు ఒకేసారి నగదు బదిలీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యలో జూలై 5 ఆదివారం మినహాయించి, మిగిలిన రోజుల్లో ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

బడ్జెట్ కేటాయింపులు – ప్రభుత్వ సంకల్పం:

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 73 లక్షల మంది పట్టాదారులు ఉండగా, కోటిన్నర ఎకరాల సాగు భూమి అందుబాటులో ఉంది. ఎకరానికి రూ. 6,000 చొప్పున రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ. 18,000 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేసిన ప్రభుత్వం, గత ఖరీఫ్‌ సీజన్‌లో వీరికి ప్రభుత్వం 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల నగదు బదిలీ చేసింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వేసే అవకాశాలున్నాయి. గత బడ్జెట్‌లోనే ఈ మొత్తాన్ని పూర్తిగా కేటాయించింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.