
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా పెట్టుబడి సాయం నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా విడుదల చేశారు. వానాకాలం సీజన్కు సంబంధించి రూ. 2,482.02 కోట్ల నిధులను సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించారు. హైదరాబాద్లోని శిల్పకళావేదికలో నిర్వహించిన ఒక ప్రత్యేక సదస్సులో ఈ నిధుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
Also Read : తెలంగాణ జనాభా లెక్కలు: 4.35 కోట్లకు చేరిన జనాభా.. గోవాను దాటేసిన గ్రేటర్ హైదరాబాద్!
ఈ పథకం కింద మొదటి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 41.37 లక్షల మంది అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ కానుంది. తొలి దశలో భాగంగా రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ ఈ పెట్టుబడి సాయం అందుతుందని ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత మిగిలిన రైతులకు కూడా దశలవారీగా ఈ నిధులను విడుదల చేయనున్నారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఈ సభను భారీ ఎత్తున నిర్వహించాలని మొదట ప్లాన్ చేసినప్పటికీ, అక్కడ గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సభ జరిగే స్థలం తడిసిపోవడంతో వేదికను హైదరాబాద్లోని శిల్పకళావేదికకు మార్చారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి సుమారు 2,500 మందికి పైగా రైతులు నేరుగా హాజరుకాగా, మిగతా జిల్లాల రైతులు, అధికారులు తమతమ ప్రాంతాల్లోని రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ వేడుకలో పాల్గొన్నారు.
Also Read : ఒంటరి పోరుతో ‘తెలంగాణ’ పీఠమే టార్గెట్: కమలనాథుల వ్యూహాత్మక రోడ్మ్యాప్!









