Venezuela
Venezuela (AI Generated Image)

ఇటీవల వెనిజులాలో సంభవించిన జంట భూకంపాలు బీభత్సం సృష్టించాయి. ఎందరో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ భూకంపం నుంచి కోలుకోక ముందే ఆకాశంలో ముదురు ఎరుపు రంగు ప్రజలను భయపెడుతోంది. సాధారణంగా ఆకాశం గులాబీ లేదా బంగారు రంగులో ఉంటుంది. కానీ కారాకోస్‌లో .. కోపంతో కూడిన ముదురు ఎరుపు రంగులో ఉంది. కొన్ని రోజుల కిందట అక్కడ జంట భూకంపం రావడంతో ఇప్పుడు.. రక్తపు ఆకాశాన్ని చూసి ఇంకా భయపడుతున్నారు. అయితే దీనికి వెనుక సైన్స్ ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

Also Read : బయట్టపడ్డ బాగోతం.. బంగ్లాదేశ్, భారత్ మధ్య చొరబాట్లు అక్కడి నుంచే.. షాకింగ్ నిజాలు!

సాధారణంగా సూర్యకాంతి మనకు తెల్లగా కనిపించినప్పటికీ.. అది ఇంద్రధనుస్సులోని ఏడు రంగుల మిశ్రమం. ప్రతి రంగుకు ఒక ప్రత్యేకమైన తరంగదైర్ఘ్యం ఉంటుంది. నీలం, ఊదా రంగుల తరంగాలు పొట్టిగా ఉంటే.. ఎరుపు, నారింజ రంగుల తరంగాలు చాలా పొడవుగా ఉంటాయి. సూర్యకాంతి భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు గాలిలోని నైట్రోజన్, ఆక్సిజన్ అణువుల వల్ల పొట్టి తరంగాలు కలిగిన నీలి రంగు అన్ని వైపులా ఎక్కువగా చెల్లాచెదురు అవుతుంది. దీనిని రేలీ స్కాటరింగ్ అంటారు. అందుకే పగటిపూట ఆకాశం మనకు నీలంగా కనిపిస్తుంది.

అయితే సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుడు భూమికి చాలా క్షితిజ సమాంతరంగా ఉంటాడు. దీనివల్ల సూర్యకాంతి వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో నీలి రంగు పూర్తిగా ముందే చెదిరిపోతుంది. కేవలం పొడవైన తరంగాలు కలిగిన ఎరుపు, నారింజ రంగులు మాత్రమే వాతావరణాన్ని దాటుకుని మన కళ్లను చేరుతాయి. వెనిజులాలో ఈ సూర్యాస్తమయ తీవ్రతను స్థానికంగా ‘కాండిలాజో’ అని పిలుస్తారు. కారకాస్‌లో ఈసారి ఆకాశం ఇంత భయంకరమైన ఎరుపు రంగులోకి మారడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి.

Also Read : ముదురుతున్న యుద్ధం.. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంటోందా?

ఒకటి ప్రతి వేసవిలో ఆఫ్రికాలోని సహారా ఎడారి నుండి బలమైన గాలుల ద్వారా సూక్ష్మ ఖనిజ ధూళి కణాలు అట్లాంటిక్ మహాసముద్రం దాటి కారకాస్ వాతావరణంలోకి చేరుతాయి. ఈ ధూళి కణాలు నీలి రంగును మరింతగా గ్రహించి.. ఎరుపు రంగు మాత్రమే తీవ్రంగా ప్రకాశించేలా చేశాయి. రెండోది.. జూన్ 24న వెనిజులాను తాకిన భారీ జంట భూకంపం వల్ల కారకాస్, లా గువైరా ప్రాంతాల్లో వేలాది భవనాలు కూలిపోయాయి. ఈ విధ్వంసం వల్ల గాలిలోకి లేచిన భారీ వ్యర్థాలు, సూక్ష్మ ధూళి కణాలు వాతావరణంలో కలిసిపోవడం వల్ల ఆకాశ రంగు ముదురు ఎరుపుగా మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.