
Hyderabad: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్కృష్ణారెడ్డి వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై ఉదయ్కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే తీవ్రమైన ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు కాగా తాజాగా ఆయనకు ఉప్పరపల్లి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. విచారణ జరిపిన కోర్టు ఉదయ్కృష్ణారెడ్డికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను కట్టుదిట్టమైన భద్రత మధ్య హైదరాబాద్లోని చంచల్గూడ జైలుకు తరలించారు.
Also Read : హైదరాబాద్ వాసులకు బిగ్ షాక్… 20 లక్షల ఓట్లు రద్దు? అధికారులు ఏమంటున్నారంటే?
కాగా తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బాధితురాలిని అసభ్యకరమైన మెసేజ్లతో వేధించడంతో పాటు అకాడమీలో అందరి ముందు కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆమె గదిలోకి బలవంతంగా వెళ్లి జుట్టు పట్టుకుని గొంతు నులమడం, కత్తితో బెదిరించడం, భయపెట్టి ఆమె ఫోన్ను తీసుకుని వ్యక్తిగత సందేశాలను పరిశీలించడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు సంబంధించి ప్రైవేట్ వీడియోను రికార్డ్ చేసి, ఆమె భర్తకు పంపిస్తానని బ్లాక్మెయిల్ చేశారని బాధితురాలు పోలీసులకు తెలిపారు.
ఈ ఘటనపై విచారణ జరిపిన అకాడమీ అంతర్గత కమిటీ సీసీటీవీ పుటేజీ ఇతర ఆధారాలను పరిశీలించి ప్రాథమిక నిర్ధారణకు రావడంతో, నిందితుడిని సస్పెండ్ చేశారు. ఈ కేసు దర్యాప్తును మహిళా భద్రతా విభాగానికి బదిలీ చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న ఉదయ్కృష్ణారెడ్డిని పోలీసులు నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు కొద్దీసేపటి క్రితమే 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
ఇక ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టుపై పోలీసుల కీలక ప్రకటన చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో కానిస్టేబుల్గా పనిచేశాడని సీపీ సజ్జనర్ తెలిపారు. యూపీఎస్సీ రాసి 2025లో ఐపీఎస్గా ఎంపికయ్యాడన్నారు. 2025 మధ్యలో ఆయనకు ఇన్స్టాలో బాధితురాలు పరిచయమైందని చెప్పుకొచ్చారు.
Also Read : కబ్జాదారులే హైడ్రా వద్దంటున్నారు… సీఎం రేవంత్ సంచలన కామెంట్స్!









