Thursday, May 21, 11:47
34.2 C
Hyderabad

Hormuz: హర్మూజ్ జలసంధిని దాటిని రెండు భారతీయ LPG నౌకలు

Two India-bound LPG tankers cross Strait of Hormuz
Two India-bound LPG tankers cross Strait of Hormuz

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. భారత్‌కు చెందిన రెండు LPG ట్యాంకర్ నౌకలు హర్మూజ్‌ జలసంధిని సురక్షితంగా దాటాయి. ‘సైమి’, ‘ఎన్‌వీ సన్‌షైన్‌’ అనే రెండు నౌకలు శత్రువులకు చిక్కకుండా ఉండేందుకు ట్రాన్స్‌పాండర్‌లను ఆపివేసి మరీ ఈ జలాలను దాటడం గమనార్హం. ఈ ఎల్పీజీ ట్యాంకర్ల ద్వారా సుమారు 66 వేల టన్నుల వంటగ్యాస్ మే 16, 18 తేదీల్లో వరుసగా కాండ్లా, మంగళూరు రేవులకు చేరుకోనుంది. తాజా పరిణామాలతో పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభం అయినప్పటి నుంచి భారత్‌కు చేరిన నౌకల సంఖ్య 13కు చేరినట్లు అధికారులు తెలిపారు. 

Also Read: ఢిల్లీలో వర్క్‌ ఫ్రం హెం.. సీఎం రేఖా గుప్తా 10 కీలక ప్రకటనలు

మరోవైపు బుధవారం సముద్ర జలాల్లో భారత్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. సోమాలియా నుంచి షార్జాకు ప్రయాణిస్తున్న భారతీయ ఢౌ నౌక ‘హాజీ అలీ’పై ఒమాన్ తీరానికి దగ్గర్లో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దీంతో అది సముద్రంలో మునిగిపోయింది. ఈ దాడిని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. నౌకలోని 14 మంది సిబ్బంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఒమాన్‌లోని డిబ్బా రేవులో ఉన్న వీళ్లను త్వరలోనే స్వదేశానికి తీసుకురానున్నారు. 

Also Read: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు.. నేటి నుంచి అమల్లోకి

మరోవైపు హర్మూజ్‌ జలసంధి నుంచి 30 చైనా నౌకలు ప్రయాణించేందుకు ఇరాన్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. జలసంధిని అన్ని వాణిజ్య నౌకల కోసం తెరిచే ఉంచినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలు తమ నావికాదళానికి సహకరించాలని కోరారు. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకంగా ఉన్న హర్మూజ్‌ జలసంధిలో భారత్, చైనా నౌకల కదలికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.