Khavdya Hill tragedy, Chhatrapati Sambhajinagar
Khavdya Hill tragedy, Chhatrapati Sambhajinagar

మహారాష్ట్రలో తీవ్ర విషాదకర సంఘటన జరిగింది. కొడుకు కొండ మీద నుంచి దూకేయగా.. అతడిని కాపాడటానికి వెళ్లిన తండ్రి కూడా అదుపుతప్పి కిందపడి మరణించారు. ఇక భర్త, కొడుకు మరణాన్ని అతి దగ్గర నుంచి మహిళ వాళ్లులేని జీవితం తనకు వద్దనుకుని అదే కొండ మీద నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. ఛత్రపతి సంభాజీనగర్‌లోని టిస్‌గావ్ ప్రాంతంలో గల ఖవద్య కొండపై జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

18ఏళ్ల కునాల్ మురళీధర్ చంద్వాడే ఇవాళ ఉదయం 10 గంటలకు ఖవద్య కొండపైకి వెళ్లాడు. అనంతరం కునాల్ కొండపై నుంచి దూకడానికి ప్రయత్నిస్తున్నాడని అతడి తండ్రి మురళీధర్ చంద్వాడే, తల్లి సంగీతా చంద్వాడేలకు సమాచారం అందింది. దీంతో వెంటనే వారు హుటా హుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆపై కొండ మీద నుంచి దూకడానికి రెడీగా ఉన్న కునాల్‌ను కాపాడటానికి తల్లిదండ్రులు, అక్కడున్న మరికొందరు తీవ్రంగా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

అలా చాలా సేపు కునాల్‌ను దూకవద్దని చెప్తూనే ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడున్న వారంత ఎంత చెప్పినా కునాల్ మాత్రం ఎవ్వరి మాట వినలేదు. చెప్పి చెప్పి అలసిపోయిన తండ్రి మురళీధర్ కొడుకు కునాల్‌ను పట్టుకోవడానికి ముందుకు వెళ్లాడు. తండ్రి రావడాన్ని చూసిన కునాల్ వెంటనే కొండ మీద నుంచి కిందికి దూకేశాడు. అదే సమయంలో కొడుకును కాపాడే ప్రయత్నంలో మురళీధర్ కూడా అదుపుతప్పి కొండమీద నుంచి పడిపోయాడు. ఇలా తండ్రీ కొడుకులిద్దరూ కొండ మీద నుంచి పడి ప్రాణాలు కోల్పోయారు.

ఇక తన కళ్లెదుటే కొడుకు, భర్త కొండ మీద నుంచి పడిపోవడాన్ని చూసిన తల్లి సంగీతా చంద్వాడేకు అక్కడ ఏం జరిగిందో కాసేపు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆమె కూడా కొండ మీద నుంచి కిందకు దూకి చనిపోయారు. వీరంతా దేవ్లాయ్-సతారా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. బిడ్డను కాపాడే ప్రయత్నంలో కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాం నింపింది. అయితే కునాల్ ఎందుకు చనిపోవాలనుకున్నాడో అనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.