Tuni

Tuni Girl Missing Case : కాకినాడ జిల్లా తునిలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలకమైన మలుపు చోటుచేసుకుంది. పాప కనిపించకుండా పోయి దాదాపు 30 రోజులు గడుస్తున్నా ఇంకా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు కిడ్నాప్ కోణంలోనే దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తాజాగా లభించిన ఓ సీసీటీవీ ఫుటేజ్ ఈ కేసులో సరికొత్త ట్విస్ట్‌కు దారితీసింది.

పాప మిస్సయిన రోజు సీహెచ్ అగ్రహారం పరిసర ప్రాంతాలలో ఒక కియా కారు అనుమానాస్పదంగా పలుమార్లు చక్కర్లు కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఆ కారు, అందులోని వ్యక్తుల ప్రవర్తనపై జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి బలమైన కారణం ఉందంటూ చిన్నారి కుటుంబ సభ్యులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు.

అదే రోజు నర్సీపట్నం ప్రాంతంలో ఈ కియా కారే జ్ఞానేశ్వరి తాతను బలంగా ఢీకొట్టిందని, యాక్సిడెంట్ చేసిన తర్వాత డ్రైవర్ కారును ఆపకుండా వేగంగా దూసుకెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒకవైపు పాప అదృశ్యమైన ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరగడం, అదే సమయంలో నర్సీపట్నంలో తాతను ఢీకొట్టి పారిపోవడంతో ఈ కిడ్నాప్‌ వెనుక ఆ కారు ఉన్నట్లు వారు బలంగా నమ్ముతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు.. ఆ కియా కారు వివరాలను సేకరిస్తూ ఆ దిశగా విచారణను మరింత వేగవంతం చేశారు.

కాగా కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో జరిగిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు ఏపీలో పెద్ద సంచలనంగా మారింది. జూన్ 6వ తేదీన ఈ పాప తోటలో ఆడుకుంటూ అదృశ్యమైంది. పాప వాళ్ల అమ్మ ఇంట్లో వంట వండుతున్న సమయంలో, బయట ఆడుకుంటున్న జానూ కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే మాయమైపోయింది. చివరిగా ఒక గ్రామస్థుడు పాపను ఒక పెంపుడు కుక్కతో కలిసి కొండ వైపు వెళ్లడం చూశాడు. ఆ తోటలోని ఇనుప కంచె వద్ద చిన్నారి బట్టల పోగులు, జుట్టు ఎంట్రుకలు కొన్ని వేలిముద్రలను క్లూస్ టీమ్ సేకరించింది.

పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు డ్రోన్లు, డాగ్ స్క్వాడ్‌లతో సుమారు 1,000 ఎకరాల అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. ఇప్పటికీ ఖచ్చితమైన ఆచూకీ దొరకకపోవడంతో, చిన్నారి సమాచారం అందించిన వారికి రూ.లక్ష నగదు పారితోషికం ఇస్తామని తుని పోలీసులు అధికారికంగా ప్రకటించారు.

 

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.