
Dengue Vaccine : ఇండియాలో డెంగ్యూ వ్యాధి నియంత్రణ కోసం తొలిసారిగా క్యూడెంగా వ్యాక్సిన్కు ఆమోదం లభించింది. దేశంలో గత రెండు దశాబ్దాల్లో డెంగ్యూ కేసులు ఏకంగా 88 రెట్లు విపరీతంగా పెరగడంతో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. 2001లో దేశవ్యాప్తంగా కేవలం 3,306 కేసులు మాత్రమే నమోదు కాగా, 2023 నాటికి ఆ సంఖ్య రికార్డు స్థాయిలో 2,89,235కి చేరింది. ఆ తర్వాత 2025లో కూడా భారత్లో 1,21,824 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఈ వ్యాక్సిన్కు అనుమతి ఇచ్చింది. జపాన్కు చెందిన టకెడా ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన ఈ క్యూడెంగా వ్యాక్సిన్, డెంగ్యూ వైరస్లోని నాలుగు రకాల నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుంది. 4 నుండి 60 సంవత్సరాల వయస్సు గల ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు. వ్యాక్సిన్ వేయించుకునే ముందు ఎలాంటి ముందస్తు డెంగ్యూ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. మూడు నెలల వ్యవధితో రెండు డోసులుగా ఈ టీకా ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 43 దేశాలకు పైగా ఆమోదం పొందిన ఈ వ్యాక్సిన్కు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ముందస్తు అర్హతను జారీ చేసింది.
ఎందుకు అవసరమంటే:
జాతీయ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ గణాంకాల ప్రకారం, 2010 వరకు దేశంలో ఏడాదికి నమోదైన డెంగ్యూ కేసులు 30 వేల లోపునే ఉండేవి. కానీ ఆ తర్వాత నుంచి కేసులు భారీగా పెరుగుతూ వచ్చాయి. 2016లో మొదటిసారిగా లక్ష కేసులు దాటగా, 2023 నాటికి ఆ సంఖ్య మూడు లక్షలకు చేరువయింది.
2025 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాల వారీగా చూస్తే, తమిళనాడులో అత్యధికంగా 23,407 కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రతి ఐదు కేసుల్లో ఒకటి తమిళనాడులోనే ఉండటం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్రలో 14,168, కేరళలో 10,923 కేసులు వచ్చాయి. అలాగే ఉత్తరప్రదేశ్లో 9,206, తెలంగాణలో 8,412 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో కూడా వేలాదిగా కేసులు వెలుగుచూశాయి. దీన్నిబట్టి డెంగ్యూ వ్యాధి కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా దేశంలోని చాలా భాగాలకు విస్తరించిందని స్పష్టమవుతోంది. ఏదేమైనా, ఏళ్ల తరబడి పెరుగుతున్న డెంగ్యూ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఈ కొత్త వ్యాక్సిన్ రూపంలో భారత్కు ఒక బలమైన ఆయుధం లభించినట్టయింది.









