Rythu Bharosa : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం సీజన్‌ పెట్టుబడి సహాయం కింద అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన రైతు భరోసా సదస్సులో మంగళవారం (జూన్ 30న) అధికారికంగా ఈ నిధులను ప్రారంభించారు. ఈ ఏడాది రైతులకు ఎకరానికి రూ.6,000 చొప్పున పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 73.32 లక్షల మంది రైతులకు చెందిన కోటిన్నర ఎకరాలకు గానూ, మొత్తం రూ.9,000 కోట్లను రాబోయే తొమ్మిది రోజుల వ్యవధిలో విడతల వారీగా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఈ నిధుల విడుదలలో భాగంగా తొలి విడత కింద రెండు ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లో నగదును జమ చేశారు. మొదటి విడతలోనే సుమారు 44.28 లక్షల మంది లబ్ధిదారులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2,482.02 కోట్లను ప్రభుత్వం విజయవంతంగా బదిలీ చేసింది. మిగిలిన రైతులకు కూడా తొమ్మిది విడతల్లో నిధులు అందుతాయని సీఎం స్పష్టం చేశారు. అయితే, అర్హులైన రైతులు తమ ఖాతాల్లో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి, ఒకవేళ రాకుంటే ఏం చేయాలో కింద వివరించిన ప్రక్రియ ద్వారా తెలుసుకోవచ్చు.

Also Read : మొగుణ్ణి వదిలేస్తా కానీ ప్రియుణ్ణి వదలను.. అడ్డంగా దొరికిపోయిన భార్య షాకింగ్ కామెంట్స్!

రైతు భరోసా స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునే విధానం

రైతులు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగా డబ్బులు పడ్డాయా లేదా అని చెక్ చేసుకోవచ్చు:

ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://rythubharosa.telangana.gov.in ను ఓపెన్ చేయాలి.

హోమ్‌పేజీలో కుడివైపు పైభాగంలో ఉన్న ‘లాగిన్’ (Login) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

అక్కడ లబ్ధిదారుడి పేరు, పాస్‌వర్డ్ , క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. ఒకవేళ వివరాలు లేకపోతే, మీ మొబైల్ నెంబర్ ద్వారా కూడా ఓటీపీతో లాగిన్ అవ్వచ్చు.

లాగిన్ అయిన తర్వాత స్క్రీన్‌పై కనిపించే ‘Beneficiary Status’ లేదా ‘Payment Status’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ లేదా పట్టాదారు పాస్‌బుక్ నెంబర్ నమోదు చేసి ‘సబ్‌మిట్’ బటన్ నొక్కాలి.

వెంటనే మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా లేదా, ఏ అకౌంట్‌లో ఎంత మొత్తం పడింది అనే పూర్తి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

అకౌంట్‌లో డబ్బులు పడకపోతే ఏం చేయాలి?
మొదటి విడత జాబితాలో ఉండి కూడా రెండు రోజులైనా బ్యాంక్ ఖాతాలో నగదు జమకాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాంకేతిక లేదా డాక్యుమెంట్ లోపాల వల్ల ఇలా జరిగే అవకాశం ఉంది. వాటిని ఇలా సరిచేసుకోవాలి:

వివరాల సరిపోలిక (Data Matching): మీ పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డ్,  బ్యాంక్ ఖాతా పుస్తకంలో మీ పేరు ఒకేలా ఉందో లేదో సరిచూసుకోండి. పేర్లలో స్పెల్లింగ్ తప్పులు ఉంటే నిధులు నిలిచిపోయే అవకాశం ఉంది.

బ్యాంక్ అనుసంధానం: మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోండి. అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ (IFSC) కోడ్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూడండి.

అధికారులను సంప్రదించడం: పైవన్నీ సరిగ్గా ఉన్నా డబ్బులు రాకుంటే, వెంటనే మీ పరిధిలోని గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) ని గానీ లేదా మండల వ్యవసాయ అధికారి (MAO) ని గానీ కలవాలి. వారు మీ సమస్యను పరిశీలించి, ఎక్కడ లోపం ఉందో గుర్తించి సరిచేస్తారు.

కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి సువర్ణావకాశం
రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలో ఇప్పటివరకు పేరు నమోదు కాని అర్హులైన రైతులకు ప్రభుత్వం మరో గొప్ప అవకాశం కల్పించింది. జూన్ 15 లోపు కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులు లేదా గతంలో రిజిస్టర్ చేసుకోలేకపోయిన వారు జూలై 5 లోపు తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO)ని కలిసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం అవసరమైన సర్టిఫికేట్లు (పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్) సమర్పించి ఈ పథకంలో పేరు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read : పెళ్లయిన 40 రోజులకే విషాదం.. విశాఖలో నవ వధువు ఆత్మహత్య!

ఓపెన్ కానీ వెబ్ సైట్

అయితే ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు ప్రకటించినప్పటికీ ఇప్పటికీ చాలామందికి డబ్బులు పడలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారణం తెలుసుకునేందుకు వెబ్ సైట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే అది కూడా ఓపెన్ కావడం లేదని వాపోతున్నారు.పలువురు రైతులు బ్యాంక్ ఖాతాలు, కొత్తగా పట్టదారు పాస్ బుక్ లను ఎంటర్ చేయడానికి వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే సైట్ ఓపెన్ కాలేదని కొంతమంది, రైతులు ఇచ్చిన డిటెయిల్స్ యాడ్ చేయడానికి రిక్వెస్ట్ పెట్టామని కొంతమంది చెబుతున్నారని రైతులు పేర్కొంటున్నారు. దీంతో చాలామంది రైతులకు ఇప్పటివరకు రైతుభరోసా జమ కాకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.