Hyderabad :  హైదరాబాద్ బిర్యానీ అంటే దేశ విదేశాల్లో క్రేజ్.. కానీ, అదే బిర్యానీని వండే వంటగదులు ఇప్పుడు నగరవాసులకు దడ పుట్టిస్తున్నాయి. బడా బడా బ్రాండ్లు, రంగురంగుల లైటింగ్స్, ఏసీ రూముల వెనుక ఉన్న అసలు కుళ్లిన నిజాలు ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో బయటపడ్డాయి. ఐటీ కారిడార్‌లోని అత్యంత పాపులర్ రెస్టారెంట్లయిన షా గౌస్, మేఫిల్, పాలమూరు గ్రిల్స్, ఐడియల్ కిచెన్ లలో ఫుడ్ ప్రిపరేషన్ అత్యంత చండాలంగా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. వంట గదుల్లో ఈగలు, బొద్దింకల రోత చూసి అధికారులే విస్తుపోయారు.

Also Read : SIR జాబితాలో తన పేరు లేదని భయంతో వ్యక్తి ఆత్మహత్య!

లకోటియా ముఖాముఖిగా పేరుగాంచిన గచ్చిబౌలిలోని షా గౌస్ రెస్టారెంట్‌లో తనిఖీలు చేయగా షాకింగ్ దృశ్యాలు వెలుగుచూశాయి. కస్టమర్లకు ఎంతో ఇష్టంగా వడ్డించే చికెన్, మటన్ బిర్యానీ హండీలపై ఎక్కడ చూసినా ఈగలు ముసురుతూ కనిపించాయి. హైజీన్ ప్రమాణాలను గాలికొదిలేసి, ఎలాంటి మూతలు లేకుండా ఓపెన్‌గా ఫుడ్ ఉంచడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదాపూర్‌లోని ఐడియల్ కిచెన్ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. టిఫిన్లు, ఇతర వంటకాల కోసం నిల్వ ఉంచిన పిండిలో బొద్దింకలు తిరుగుతుండగా, మినపపప్పులో పురుగులు పట్టి సంచరిస్తున్నాయి. కనీస శుభ్రత పాటించకుండా పురుగులు పట్టిన కిరాణా సామాగ్రితోనే ఇక్కడ వంటకాలు కానిచ్చేస్తున్నట్లు తేలింది.

నాన్-వెజ్, వెజ్ వెరైటీలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే కొండాపూర్‌లోని పాలమూరు గ్రిల్స్ లో నిబంధనలకు విరుద్ధంగా గడువు ముగిసిన దాటిపోయిన మష్రూమ్స్ పుట్టగొడుగులు వాడుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. నిబంధనల ప్రకారం ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన క్వాలిటీ అడిట్‌లో ఈ స్టార్ రెస్టారెంట్లకు వచ్చిన మార్కులు చూస్తే కస్టమర్ల గుండె గుభేల్ అనాల్సిందే.

కేవలం బోర్డులకే పరిమితమై, వంటిళ్లను నరకప్రాయంగా మార్చిన ఈ రెస్టారెంట్ల నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. వేల రూపాయలు పోసి ఆర్డర్ ఇచ్చుకుంటున్న ఫుడ్ వెనుక ఇంతటి అపరిశుభ్రత దాగి ఉందనే నిజం నగరవాసులను, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Also Read : ‘వన్‌గ్రామ్’ బంగారు బాబులు.. ఆర్భాటాల వెనుక అసలు బండారం!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.