Ali Khamenei House : అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. టెహ్రాన్‌లోని ఆయన అధికారిక నివాస సముదాయమే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఇతర కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న ఖమేనీ కాంపౌండ్‌కు సంబంధించిన దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ మీడియా తాజాగా తొలిసారిగా అధికారికంగా విడుదల చేసింది.

ఇరాన్ మీడియా పంచుకున్న 35 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఖమేనీ నివాస భవనం అత్యంత దారుణంగా ధ్వంసమైన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా ప్రయోగించిన బాంబుల దాటికి అక్కడి కాంక్రీట్ నిర్మాణాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఈ కీలక దృశ్యాలను బయటపెట్టడం ద్వారా అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించేందుకు ఇరాన్ యత్నించింది.

Also Read : అస్త్ర నుంచి బ్రహ్మోస్ వరకు.. భారత్ వెపన్లకు మస్త్ డిమాండ్.. కారణం ఏంటో తెలుసా?

వారం రోజులుగా ఖమేనీ పార్థివ దేహానికి సంబంధించి అంతిమయాత్ర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఇరాన్, ఇరాక్ దేశాల్లోని పలు ప్రధాన నగరాల మీదుగా ఈ యాత్ర సాగింది. తమ సుప్రీం నేతకు ఆఖరి వీడ్కోలు చెప్పేందుకు లక్షలాది మంది ప్రజలు రహదారులపైకి తరలివచ్చారు. శోకసంద్రంలో మునిగిపోయిన పౌరులు అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.

Also Read : అమెరికా వెళ్లాలనుకునే టెకీలకు షాకింగ్ న్యూస్.. H-1B వీసా స్కామ్‌.. జేడీ వాన్స్ సంచలన ప్రకటన!

ఖమేనీ సొంత పట్టణమైన మషహద్‌లో గురువారం నాడు ఆయన పార్థివ దేహానికి ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి ఆటంకం కలిగించేలా అమెరికా దాడులు నిర్వహించిందని ఇరాన్ ఆరోపించింది. మషహద్‌ పట్టణానికి చేరుకోవడానికి అత్యంత కీలకమైన రెండు వంతెనలు ఈ దాడుల్లో ధ్వంసమవ్వగా, భద్రతా కారణాల రీత్యా టెహ్రాన్-మషహద్ మధ్య రైలు రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేశారు.

ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా కుట్ర పూరితంగా దాడులకు పాల్పడుతోందని ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రకమైన సైనిక చర్యలు ఇలాగే కొనసాగితే, అమెరికా, దాని మిత్రదేశాలపై తాము ఇచ్చే తిరుగులేని స్పందన అత్యంత భీకరంగా ఉంటుందని ఐఆర్‌జీసీ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న జరిగిన ఈ దాడులతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకున్నాయి. ఇరాన్ అత్యున్నత నాయకుడి మరణం, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తీవ్రత పెరగడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధం వచ్చిపడుతుందేమోనన్న తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ తీసుకోబోయే ప్రతికార చర్యలపైనే భవిష్యత్ పరిణామాలు ఆధారపడి ఉన్నాయి.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.