దశాబ్దాలుగా పాకిస్తాన్ పాలకుల చేతిలో అణచివేతకు, వివక్షకు గురవుతున్న బలూచిస్తాన్ ప్రాంతంలో ఇప్పుడు తిరుగుబాటులు చివరి దశకు చేరాయి. పాకిస్తాన్ సైన్యం గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా బలూచిస్తాన్ గణతంత్ర రాజ్యం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితమే పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న ఈ సంస్థ.. ఇప్పుడు దేశ నిర్మాణంలో కీలకమైన అడుగు వేసింది. 2027వ సంవత్సరంలో బలూచిస్తాన్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సొంతంగా జాతీయ జనాభా గృహ గణన నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించి ఇస్లామాబాద్‌కు గట్టి షాక్ ఇచ్చింది.

Also Read : ఇజ్రాయెల్ పార్లమెంటు రద్దు: అక్టోబర్ 27న ఎన్నికలు!

ఈ సరికొత్త జనాభా గణన ప్రకటన వెనుక పాకిస్తాన్ పాలకుల కుట్రలను బట్టబయలు చేసే ప్లాన్ ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక రికార్డుల ప్రకారం బలూచిస్తాన్ మొత్తం జనాభా కేవలం 1.5 కోట్లు మాత్రమే. అయితే ఈ అధికారిక నంబర్లను బలూచిస్తాన్ గణతంత్ర రాజ్యం పూర్తిగా తిరస్కరించింది. బలూచిస్తాన్‌కు వచ్చే నిధులు, వనరులను తక్కువ చేయడానికే పాకిస్తాన్ జనాభా లెక్కల సంస్థ ఉద్దేశపూర్వకంగా తమ జనాభాను తక్కువ చేసి చూపిస్తోందని సంచలన ఆరోపణలు చేసింది. వాస్తవానికి బలూచిస్తాన్ భూభాగంలో దాదాపు 6 కోట్ల జనాభా నివసిస్తోందని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే రికార్డులను ప్రపంచం ముందు పెట్టడానికే తామే స్వయంగా 2027లో జనాభా లెక్కల సేకరణ చేపడుతున్నట్లు తెలిపింది.

Also Read : ఇరాన్ పద్మవ్యూహంలో చిక్కుకున్న ట్రంప్‌!

ఈ జనాభా గణన ప్రక్రియలో పాకిస్తాన్‌కు చెందిన ఏ ఒక్క ప్రభుత్వ సంస్థకు లేదా అధికారికి ప్రమేయం ఉండబోదని బలూచ్ ప్రతినిధులు స్పష్టం చేశారు. బలూచిస్తాన్ గణతంత్ర రాజ్యానికి చెందిన సొంత జాతీయ సంస్థలు, వారి అధికారిక ప్రతినిధులు మాత్రమే రంగంలోకి దిగి ఈ డేటాను సేకరిస్తారు. ప్రతి పౌరుడి నుంచి, ప్రతి కుటుంబం నుంచి సేకరించిన సమాచారాన్ని నేరుగా ‘జాతీయ డిజిటల్ డేటాబేస్’లో భద్రపరుస్తారు. దీని ద్వారా భవిష్యత్తులో బలూచ్ పౌరుల కోసం ఒక ప్రత్యేకమైన డిజిటల్ రికార్డు, డిజిటల్ గుర్తింపు కార్యక్రమం, ఓటర్ల జాబితా, పన్నుల విధానాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్ తరాల కోసం ఆధునిక, జవాబుదారీతనం గల డిజిటల్ దేశాన్ని నిర్మించడానికి ఈ జనాభా గణన బేస్‌మెంట్‌గా మారనుంది.

ఈ జనాభాలో బలూచిస్తాన్ మొత్తం వాస్తవ జనాభా, దేశంలోని మొత్తం మహిళల సంఖ్య, పిల్లలు, యువత, వృద్ధుల సంఖ్య, ప్రతి ఇంటి పూర్తి వివరాలు, గృహ సమాచారం, ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా ఉన్న జనాభా వివరాలు సేకరిస్తారు. గతంలో పాకిస్తాన్ ప్రభుత్వం అంచనాల ఆధారంగా, తప్పుడు లెక్కలతో బలూచిస్తాన్‌కు మొండిచేయి చూపించేదన్నారు. కానీ తాము సేకరించబోయే కచ్చితమైన సమాచారం ఆధారంగానే దేశపు తొలి అధికారిక జనాభా జాబితాను సిద్ధం చేసి.. దాని ద్వారానే ‘జాతీయ బడ్జెట్‌’ను రూపొందిస్తామని బలూచిస్తాన్ సంస్థ వెల్లడించింది. ఈ డేటా వల్ల ఏ రంగానికి ఎంత బడ్జెట్ ఇవ్వాలి? ఏ జిల్లాలో ఎన్ని కొత్త స్కూళ్లు కట్టాలి? హెల్త్ సెక్టార్‌కు ఎంత నిధులు కేటాయించాలి? రోడ్లు, కరెంట్, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలపై ఎంత ఖర్చు పెట్టాలి? అలాగే సామాజిక సంక్షేమ పథకాలు నిజమైన బాధితులకు అందుతున్నాయా లేదా? అనే విషయాలను అమలు చేయడానికి వీలవుతుందని తెలిపింది.

బలూచిస్తాన్ ప్రాంతం దశాబ్దాలుగా పాకిస్తాన్ పాలకుల చేతిలో ఘోరమైన అణచివేతను, మానవ హక్కుల ఉల్లంఘనను ఎదుర్కొంటోంది. బలూచిస్తాన్ గడ్డపై లభించే గ్యాస్, బంగారం వంటి విలువైన సహజ వనరులను పాకిస్తాన్ దోచుకుంటోందే తప్ప.. స్థానిక బలూచ్ ప్రజల రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక హక్కులను పూర్తిగా ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయితే ఇప్పటికీ బలూచిస్తాన్‌లోని 85 శాతం ప్రాంతం తమ ఆధీనంలోనే ఉందని బలూచ్ నేత మీర్ యార్ బలూచ్ అన్నారు. స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న కొద్ది రోజుల్లోనే.. బలూచిస్తాన్ గణతంత్ర రాజ్యం తమకంటూ ఒక ప్రత్యేక జాతీయ పతాకాన్ని, జాతీయ చిహ్నాన్ని, పరిపాలనా నిర్మాణాన్ని సిద్ధం చేసుకుంది. ఇప్పుడు నేరుగా జాతీయ జనాభా గణనను కూడా అనౌన్స్ చేసి పాకిస్తాన్‌కు బిగ్ షాక్ ఇచ్చింది.