
Adilabad : రోడ్లపై తిరిగే పశువులకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి, విలాసవంతమైన కార్లలో కుక్కి.. పొరుగు రాష్ట్రాల్లోని వధశాలలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఒక భారీ అంతర్రాష్ట్ర ఘరానా దొంగల ముఠా ఆట కట్టించారు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు. సినిమా ఫక్కీలో సాగుతున్న ఈ దొంగతనాల నెట్వర్క్ను ఛేదించి, ముఠాలోని ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఈ ముఠా నేరాలకు పాల్పడే విధానం పోలీసులనే విస్మయానికి గురిచేసింది. నిందితులు రాత్రి వేళల్లో ఎస్యూవీ (SUV), ఇన్నోవా వంటి లగ్జరీ వాహనాలతో రెక్కీ నిర్వహించేవారు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఈ కార్ల వెనుక సీట్లను పూర్తిగా తొలగించారు. అనంతరం రోడ్లపై, ఇళ్ల ముందు కట్టేసిన పశువులకు ప్రత్యేక రసాయనాలు, మత్తు మందు ఇంజక్షన్లు ఇచ్చి నిశ్శబ్దంగా కార్లలోకి ఎక్కించేవారు. వాటిని మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలో ఉన్న వధశాలలకు తరలించి భారీ మొత్తానికి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు.
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పాత నేరస్థులు ఈ ముఠాలో ఉన్నట్లు విచారణలో తేలింది. వీరు పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి వాహనాలకు నకిలీ నంబర్ ప్లేట్లను అమర్చేవారు. టోల్ప్లాజాలు, పోలీసు చెక్పోస్టులు ఉండే ప్రధాన రహదారులను కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లోని అంతర్గత రహదారులను ఎంచుకుని పశువులను స్మగ్లింగ్ చేసేవారు. తెలంగాణతో పాటు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో వీరు యథేచ్ఛగా ఈ దొంగతనాలకు పాల్పడ్డారు.
ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని తలమడుగు, తాంసి, జైనథ్, ఆదిలాబాద్ వన్టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత ఏడాదిన్నర కాలంగా దాదాపు ఏడు పశువుల దొంగతనాలు జరిగాయి. వీటిపై రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ఎస్పీ అఖిల్ మహాజన్.. కేసు ఛేదనకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు సరిహద్దు ప్రాంతాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, మొబైల్ కాల్ డేటా, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుల కదలికలను కనిపెట్టి పక్కా వ్యూహంతో అదుపులోకి తీసుకున్నారు.
ఈ ముఠాలోని మొత్తం 13 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేయగా, ప్రస్తుతానికి ఐదుగురిని కటకటాల్లోకి నెట్టారు. పరారీలో ఉన్న మిగిలిన ఎనిమిది మంది నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. పట్టుబడిన వారి నుంచి దొంగతనానికి ఉపయోగించిన ఒక విలాసవంతమైన కారు, ఐదు మొబైల్ ఫోన్లు, రవాణాకు సిద్ధంగా ఉంచిన నకిలీ నంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ముఠాపై ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లోనూ పలు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పశువుల దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు రాత్రి వేళల్లో తమ పశువులను సురక్షితమైన పాకల్లో లేదా ఇళ్ల ప్రాంగణాల్లో ఉంచాలని ఎస్పీ సూచించారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరించినా, అనుమానాస్పదంగా కార్లు తిరుగుతున్నా వెంటనే ‘డయల్ 100’ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అత్యంత ప్రతిభావంతంగా ఈ కేసును ఛేదించిన డీఎస్పీ జీవన్ రెడ్డి, టౌన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు, వన్టౌన్ ఇన్స్పెక్టర్ బి. సునీల్ కుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మరియు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు.








