
రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోతుంది. తరచూ ఇలాంటి ఘటనల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో జరిగిన భయంకరమైన యాక్సిడెంట్ స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది.
కవిటి మంటల పరిధిలోని హైవేపై ప్రయాణికులతో వెళ్లిన ఓ ఆటో రోడ్డు పక్కన ఆగింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఆ ఆటోను ఢీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో జరిగిన ఈ యాక్సిడెంట్ వివరాల ప్రకారం.. బాధితులు ప్రయాణిస్తున్న ఆటో జమేదారిపుట్టుగ వద్ద నేషనల్ హైవే పక్కన ఆగి ఉంది. వీరంతా ఒడిశాలోని బ్మహ్మపుర పట్టణానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో పలాస వైపు నుంచి అతి వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి హైవే పక్కన ఆగిన ఉన్న ప్రయాణికుల ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఆటో నుజ్జు నుజ్జు అవగా.. అందులో కూర్చున్న మురపాల పార్వతి, నర్తు పద్మమ్మ, మండపల్లి తరినమ్మ అనే ముగ్గురు మహిళలు స్పాట్లో ప్రాణాలు కోల్పోయారు.
మరో ఇద్దరు ప్రయాణికులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప హాస్పిటల్కు తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల కోసం తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.









